
అమరావతి: సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. 231 LLBCలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమానికి బ్యాంకుల సహకారంపై చర్చించారు. 175 నియోజకర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంపై కూడా చర్చించారు.
రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు ఉండాలని ఆయన అన్నారు. ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఇప్పటికే రైతులకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిఉండాల్సింది అన్నారు. సీజన్ చివరిలో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లూ తీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్రం.. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది.
బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదు. తదుపరి సంస్కరణల దిళగా ప్రజలను ప్రోత్సహించాలి. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాల్ విసిరేలా మన ఆర్థిక వ్యవస్థ తయారవుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలి. 2047 నాటికి భారత్ బలమైన ఆర్థికవ్యవస్థగా తయారవుతుంది. ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కాదు. పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందకు చర్చలు చేపట్టాలి. ఆర్థికశాస్త్రం చదివిన విద్యార్థిగా, ప్రజాప్రతినిధిగా పేదల కోసమే ఆలోచిస్తా. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థికసంస్థలు పని చేయాలి అని సీఎం చంద్రబాబు అన్నారు